సచివాలయంలో స్థలం కొరత వల్లే కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నాం: హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్

  • మిలీనియం టవర్స్ కు రూ.19 కోట్లు కేటాయించారంటూ పిటిషన్
  • రాజకీయ ప్రయోజనాల కోసమేనని పిటిషనర్ ఆరోపణ
  • అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నం తరలిస్తున్నారని, అందుకోసమే విశాఖ మిలీనియం టవర్స్ కు ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులు కేటాయించిందంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇరుపక్షాల వాదనలను విన్నది.

రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖ తరలిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బదులిస్తూ, సచివాలయంలో స్థలం కొరత ఉన్నందునే కార్యాలయాలను విశాఖపట్నం తరలించాల్సి వస్తోందని వెల్లడించారు. విజిలెన్స్ కార్యాలయం 1000 చదరపు అడుగుల్లోనే కొనసాగుతోందని వివరించారు.

ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ, సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆపై, విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేసింది. మిలీనియం టవర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తాము తప్పుబట్టబోమని వెల్లడించింది.

AP Secretariat
Vizag
AP Capital
Offices
High Court

More Telugu News